ఈ రోజు స్పెషల్ ఐటం ' ముక్కల పులుసు


ఈ  రోజు  స్పెషల్   ఐటం '  ముక్కల  పులుసు  '.
రసం  ,  సాంబారు , పప్పు  పులుసు ,  పప్పు చారు  ఇలా  లిక్విడ్  ఐటమ్స్  లో  వివిధ  రకాలున్నా  ముక్కల  పులుసు  ది ప్రత్యేక  స్ధానం.  ప్రధమ  స్ధానం. 

వెనుకటి  కాలం లో ప్రతి  శుభ కార్యాల లోనూ  ఈ  ముక్కల  పులుసును  తప్పనిసరిగా   చేసేవారు.

తెలుగు  వారి  భోజనాలలో  నెయ్యి  వేసి  వేయించి  కందిపప్పు తో వండిన  ముద్ద పప్పు , పనస పొట్టు కూర , కొత్తావకాయ ,  ముక్కల పులుసు ,
కమ్మని నెయ్యి, మీగడ పెరుగు, కొనసీమ  కొత్తపల్లి  కొబ్బరి  మామిడి పండు  గొప్ప  కాంబినేషన్ .

వేయి  రూపాయల  విందు  భోజనమైనా  ఈ  మెనూ  ముందు  దిగదుడుపే .

మరి  ఈ  ముక్కల  పులుసు  తయారీ  విధానము  గురించి  తెలుసుకుందాం.

కావలసినవి.

ఆనపకాయ /  సొరకాయ  --
కాయలో  పావు  ముక్క .
మంచి  గుమ్మడికాయ  ముక్క -
షుమారు  పావు  కిలో  ముక్క.
ములక్కాడలు  --- 2
వంకాయలు  ---   2
టమోటోలు   --  2
బెండకాయలు  -  8 
చిలకడదుంపలు  -  4
పచ్చి మిర్చి   -  5
కరివేపాకు   --  మూడు  రెమ్మలు
కొత్తిమీర   --  ఒక  కట్ట

చింతపండు   --  50  గ్రా
బెల్లం   --   30  గ్రా (  తీపి  ఇష్టం లేని వారు బెల్లం  వేయకుండా  చేసుకొనవచ్చును . )
పసుపు  --  పావు  స్పూను
కారం  ---  అర  స్పూను 
ఉప్పు  ---  తగినంత 

పోపుకు

ఎండుమిర్చి   --  మూడు
మెంతులు  --  కొద్దిగా 
ఆవాలు   --  అర  స్పూను
జీలకర్ర   ---  పావు స్పూను 
ఇంగువ  --  కొద్దిగా 

తయారీ  విధానము.

ముందుగా  పదిహేను  నిముషములు  చింతపండు  నీళ్ళలో  నాన బెట్టుకుని  ఒక  రెండు గ్లాసుల  రసం  తీసుకొని  ఒక  గిన్నెలో  పోసుకోవాలి. 

ఆనపకాయ  చెక్కు  తీసుకుని ముక్కలుగా తరుగు కోవాలి .

మంచి  గుమ్మడికాయ  పై  చెక్కు   తీయనవసరము లేదు. ముక్కలుగా  తరుగుకోవాలి.

చిలకడ  దుంపలు  చెక్కు  తీయనవసరంలేదు. గుండ్రంగా  ముక్కలు  తరుగు కోవాలి.

ములక్కాడలు , టమోటాలు , బెండ కాయలు , వంకాయలు  అన్నీ  ముక్కలు  తరుగు కోవాలి .

పచ్చి  మిర్చి  నిలువుగా  చీల్చు కోవాలి .

ఇప్పుడు  ఒక  పెద్ద  గిన్నెలో  ఈ  తరిగిన   అన్ని  ముక్కలు  వేసుకోవాలి .

ఇందులో  చింతపండు   రసం  నీళ్ళు   పోయాలి . మరో  గ్లాసున్నర నీళ్ళు  పోసుకోవాలి.

ఇందులో  పసుపు , తగినంత  ఉప్పు , బెల్లం , కారం , తరిగిన  పచ్చిమిర్చి   ముక్కలు , కరివేపాకు  వేయాలి .

ఇప్పుడు  స్టౌ  వెలిగించి   మీడియం సెగన  ఈ  పులుసును  ఓ  ఇరవై  నిముషాల  పాటు  ముక్కలన్నీ  మెత్తగా   ఉడికేలా  మరగ నివ్వాలి .

ఆ తర్వాత  మూడు  విధములుగా  మన  అభిరుచిని  బట్టి  చేసుకోవచ్చు.

మొదటిది విధానము.

ముక్కలు  ఉడికాక  రెండు  గరిటెలు  మెత్తగా   ఉడికిన పప్పు  బాగా  యెనిపి  పులుసులో  వేసి  మరో  అయిదు  నిముషాలు  మరగ నిచ్చి  దింపు కోవచ్చు.

రెండవ విధానము .

 ఒక  రెండు  స్పూన్లు   బియ్యపు  పిండి తీసుకొని   అరగ్లాసు  నీళ్ళలో   వేసి  ఉండలు  లేకుండా  కలిపి , మరుగుతున్న  పులుసులో  వేసి  మరో  అయిదు  నిముషములు  కాగనిచ్చి  దింపుకోవచ్చు.

ఇక  మూడవ  విధానము.

పావు స్పూను మెంతులు ,  మూడు ఎండుమిరపకాయలు , స్పూను  పచ్చిశనగపప్పు , అర స్పూను   మినపప్పు ,  స్పూను  ధనియాలు,
కొంచెం ఇంగువ మూడు  స్పూన్లు  నూనెలో  వేయించి  అందులో  పావు  చిప్ప  ఎండు  కొబ్బరి  ముక్కలుగా  తరిగి  వేసి   వేయించుకోవాలి .

చల్లారగానే ఈ మిశ్రమము అంతా  మిక్సీ లో వేసుకొని  మెత్తని  పొడిగా  వేసుకోవాలి .

ఈ పొడిని  మరుగుతున్న పులుసులో  ముక్కలన్నీ  ఉడికాక  వేసి , మరో  అయిదు  నిముషముల  పాటు  తెర్ల నివ్వాలి.

చివరగా  పోపు  గరిట  స్టౌ  మీద పెట్టి  రెండు  స్పూన్లు   నూనె  వేసి ఎండు మిర్చి  ముక్కలు, జీలకర్ర , ఆవాలు , మెంతులు , ఇంగువ  వేసి   పోపు  పెట్టు కోవాలి .

పైన  కొత్తిమీర  తరిగి   వేసుకోవాలి .

అంతే అద్భుతమైన   రుచితో మరియు ఇంగువ  వాసనలతో ఘుమ ఘుమ  లాడే  "  ముక్కల  పులుసు "   సర్వింగ్  కు  సిద్ధం.

చక్కగా  రెండు  రోజుల పాటు భోజనము లోకి ,  ఇడ్లీల లోకి , పూరి , చపాతీ ల లోకి  వేసుకుని    తినవచ్చు.

Comments