కరివేపాకు వెల్లుల్లి పచ్చడి
కరివేపాకు వెల్లుల్లి పచ్చడి.
ఈ కరోనా కాలంలో మన శరీరంలో రోగ నిరోధక శక్తి వృద్ధి చెందడానికి మధ్య మధ్యలో వెల్లుల్లి కూడా ఆహారంలో తీసుకోవడం మంచిది . జీర్ణ శక్తి కూడా వృద్ధి చెందుతుంది.
సీజన్ మారినప్పుడు ఇలా వెల్లుల్లి , జీలకర్ర మరియు కరివేపాకు వంటివి తీసుకుంటే దగ్గు , జలుబు వంటి అనారోగ్యాలకు దూరంగా ఉంచుతుంది. ప్రస్తుతం వానాకాలం నడుస్తోంది.కావున జలుబు దగ్గు వంటి అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే ఈ పచ్చడిని చేసుకుని తినండి.
కావలసినవి.
ఎండుమిరపకాయలు - 12.
కరివేపాకు - అర కప్పు.
వెల్లుల్లి రెబ్బలు - పై పొట్టు వలిచినవి 25
చింతపండు - రెండు రెబ్బలు .
చాయమినపప్పు / పొట్టు మినపప్పు - రెండు స్పూన్లు
జీలకర్ర - స్పూను.
ఆవాలు - స్పూను.
నూనె - మూడు స్పూన్లు .
పసుపు - పావు స్పూను.
ఉప్పు - తగినంత .
తయారీ విధానము .
స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసుకుని , నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , చాయ / పొట్టు మినపప్పు , జీలకర్ర , ఆవాలు , వెల్లుల్లి రేకలు మరియు కరివేపాకును వేసుకుని పోపును కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.
పోపు చల్లారగానే ఈ వేయించిన పోపు , పావు స్పూను పసుపు మరియు తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి.
ఇందులో వేసుకునే చింతపండు తడప నవసరం లేదు . పచ్చడిలో అసలు నీరు పోయవలసిన అవసరము లేదు.
ఇది పచ్చడి / పొడి కు మధ్యస్థంగా ముద్దగా ఉంటుంది.
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని మొదటి ఐటమ్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది.
ఈ పచ్చడిలో ధనియాలు వేయనవసరం లేదు.
వెల్లుల్లి ఇష్టపడని వారు మాత్రం వెల్లుల్లి బదులుగా పోపులో స్పూనున్నర ధనియాలు వేసుకుని చేసుకొనవచ్చును .
Comments
Post a Comment